ప్రకృతి వ్యవసాయం పంటలు తుఫాను తాకిడికి తట్టుకుని నిలిచాయి
1 min read

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు మండలం, సీతంపేట గ్రామం: ఇటీవల మొంథా తుఫాను ప్రభావం తర్వాత, రసాయనిక ఎరువులు వినియోగంతో సాగు,మరియు ప్రకృతి వ్యవసాయం మధ్య తేడాను పరిశీలించడానికి శుక్రవారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు (జేడీఏ) షేక్ హబీబ్ బాషా , మరియు డిపిఎం బి. వెంకటేష్ సీతంపేట గ్రామాన్ని సందర్శించారు.తుఫాను ప్రభావంతో రసాయనిక ఎరువులు వినియోగించిన పొలాల్లో వరి పూర్తిగా నేలకూలి పడిపోయినట్లు గమనించగా, అదే సమీపంలో ఉన్న ప్రకృతి వ్యవసాయం పొలం మాత్రం తుఫాను తాకిడిని తట్టుకుని దాదాపు ఎలాంటి నష్టం లేకుండా నిలబడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ సందర్భంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు మాట్లాడుతూ, “ప్రకృతి వ్యవసాయం పంటలు వాతావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యంతో ఉంటాయని,అందుకే ప్రతి రైతు సోదరుడు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఈ మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం వల్ల మన ఆరోగ్యంతో పాటు పర్యావరణం కూడా రక్షించబడుతుందన్నారు. ఇది రైతుల ఆరోగ్యం, ఆదాయ భద్రతకు కూడా తోడ్పడుతుంది,” అని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ రైతు పరశురాముడు మరియు రసాయనిక ఎరువులు వినియోగించిన వ్యవసాయ రైతు రాము పొలాలను అధికారులు పరిశీలించారు. ఇద్దరూ స్వర్ణ వరివిత్తనమే వేశారు, నాటిన తేదీలో కేవలం ఒక రోజు తేడా మాత్రమే ఉంది. పొలాలు పక్కపక్కనే ఉన్నందున తుఫాను ప్రభావం రెండు పొలాలపై సమానంగా ఉండింది.అయితే,రైతు రాము పొలంలో 100% లాడ్జింగ్ (పంట కూలిపోవడం) చోటుచేసుకోగా, ప్రకృతి వ్యవసాయ రైతు పరశురాముడు పొలంలో కేవలం 2% లాడ్జింగ్ మాత్రమే గమనించబడింది.

