“విజయపథం” కార్యక్రమాన్ని ప్రిన్సిపాళ్లు సమర్థవంతంగా అమలు చేయాలి
1 min read

ఎ.పి.సమగ్ర శిక్ష , కర్నూలు
కర్నూలు, న్యూస్ నేడు: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) రాష్ట్ర సంచాలకుడు డి. దేవానంద్ రెడ్డి జిల్లాలోని 26 కేజీబీవీల ప్రిన్సిపాళ్లతో మంగళవారం వర్చువల్ స్టూడియో, కర్నూలు నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు “విజయపథం” కార్యక్రమాన్ని జూలై 15 నుండి ప్రారంభించామని, దాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపాళ్లపై ఉందని పేర్కొన్నారు. గతంలో పరీక్షల ముందు మాత్రమే ప్రత్యేక తరగతులు నిర్వహించేవారని, అయితే ఈసారి ప్రారంభం నుంచే రోజువారీ పరీక్షలు, ఉదయం స్టడీ అవర్స్ వంటి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక పాఠ్యాంశాలు బోధించాలి, పాఠశాలల్లో విద్యార్థులకు నిరంతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. భోజనం వండేటప్పుడు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.అలాగే అన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి మరియు అదనపు పథక సమన్వయ కర్త ఎ.పి.సమగ్ర శిక్ష , కర్నూలు ఎస్. సామ్యుల్ పాల్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి(GCDO) యం. మేరి స్నేహలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

