కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ
1 min read

రాజ్ విహార్ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు
ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరు
ఎక్కువ మంది బాధితులు రోడ్డు ప్రమాదంవారే – డా. సుమంత్
కర్నూలు, న్యూస్ నేడు : రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. కిమ్స్ హాస్పిటల్స్, కర్నూలు న్యూరోసర్జరీ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యూరోసర్జన్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ ర్యాలీ రాజ్ విహార్ సర్కిల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ హెల్మెట్ ధరించడం ప్రాణాలను కాపాడే ముఖ్యమైన అలవాటు అని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం నడిపే వారు మాత్రమే కాకుండా వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు.అనంతరం న్యూరోసర్జన్ డా. సుమంత్ కుమార్ మాట్లాడుతూ, న్యూరోసర్జరీల కోసం ఎక్కువ మంది బాధితులు రోడ్డు ప్రమాదాలు జరిగిన వారే ఎక్కువగా ఉంటారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయాలు అవుతాయని, తలకు గట్టి దెబ్బ తగిలితే మెదడు, వెన్నెముకపై తీవ్ర ప్రభావం పడుతుందని, కొన్ని సందర్భాల్లో శాశ్వత వికలాంగత లేదా ఆకస్మిక మరణాలు సంభవించే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ కర్నూలు ఏవీపీ డా. ఆదిత్య, న్యూరో సర్జరీ విభాగం డాక్టర్లు, మార్కెటింగ్ జీఎం ఆనంద్, ఆసుపత్రి సిబ్బంది, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను తరచుగా నిర్వహిస్తామని కిమ్స్ ప్రతినిధులు తెలిపారు.

