ఫ్యాక్టరీలలో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలి
1 min read

అత్యవసర ఎగ్జిట్లు, మాక్ డ్రిల్స్ తప్పనిసరి
జిల్లా కలెక్టర్ శ్రీమత్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలోని ఫ్యాక్టరీలు, కర్మాగారాలలో సంభవించే అగ్ని ప్రమాదాలు మరియు ఇతర పారిశ్రామిక విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి యూనిట్లో అత్యవసర సిద్ధత (Emergency Preparedness) తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విపత్తుల నిర్వహణ సమితి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు, కర్మాగారాలలో క్రమం తప్పకుండా అత్యవసర మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించారు. కార్మికులకు ఫస్ట్ ఎయిడ్ శిక్షణ అందించడంతో పాటు, ప్రమాద సూచికల బోర్డులు స్పష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి యూనిట్లో భద్రతా ప్రమాణాలను పరిశీలించే బాధ్యత గల సిబ్బందిని నియమించి, కార్మికులకు తగిన శిక్షణ ఇవ్వాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే మార్గాలైన ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయో ప్రతి కార్మికునికి స్పష్టంగా తెలిసేలా ఉండాలన్నారు. ఎగ్జిట్ గేట్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని, తాళాలు వేసి ఉంచడం వల్ల ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేసి, కార్మికుల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.అంతకుముందు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి పరిశ్రమల్లో సంభవించే ప్రమాదాల రకాలు, వాటి నివారణ చర్యలు, ప్రమాదం సంభవించినప్పుడు వివిధ శాఖలు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలు మరియు విధి విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీకి వివరించారు.

