ఆధునిక సాంకేతికత కలిగిన ఈ స్టేషన్ల ద్వారా సర్వే పనులు వేగంగా
1 min read

జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్.
కర్నూలు, న్యూస్ నేడు : భూసర్వే రంగంలో ఆధునిక సాంకేతికతకు నాంది పలుకుతూ కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ (CORS) లు కచ్చితత్వంతో పని చేస్తాయని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు.సోమవారం స్థానిక రాష్ట్ర అతిథి గృహం ఆవరణ లో సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన CORS కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ24 గంటలు పనిచేసే రిఫరెన్స్ స్టేషన్లు (CORS) శాటిలైట్స్ తో అనుసంధానం చేసుకొని కచ్చితమైన కొలతలు (రేఖాంశాలు, అక్షాంశాలు) కొలవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఇవి 35 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేస్తాయని తెలిపారు. ఈ స్టేషన్లు సర్వేయింగ్, మ్యాపింగ్, GIS, మౌలిక సదుపాయాల కోసం రియల్-టైమ్ కైనమాటిక్ (RTK) సేవలను అందిస్తాయన్నారు. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఆధునిక సాంకేతికత కలిగిన ఈ స్టేషన్ల ద్వారా సర్వే పనులు వేగంగా, తప్పులులేకుండా నిర్వహించగలమని తెలిపారు జిల్లాలో భూసర్వే వ్యవస్థను ఆధునికీకరించే దిశగా ఇది ఒక కీలకమైన ముందడుగని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బి.సి. పరిడా మాట్లాడుతూ ఏపీలో ఈ స్టేషన్లు 70 ఉన్నాయన్నారు. జిల్లాలో ఇప్పటికే సి.బెళగల్, హోలగుంద మండలాల్లో రెండు స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం అదనంగా నగరంలో ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రీసర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ స్టేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ సర్వేయర్ దేవబ్రత పాలిత్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేయర్ మురళి కృష్ణ, తదితర అధికారులు పాల్గొన్నారు.

