ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారానే స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర విజయవంతం
1 min read

త్వరలో 230 కోట్ల రూపాయలతో పైపులైన్ ద్వారా గోదావరి జలాల పంపిణీ
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టీకరణ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సమాజంలో సంపూర్ణమైన మార్పునకు స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం దోహదపడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. త్వరలో 230 కోట్ల రూపాయలతో పైపులైన్ ద్వారా గోదావరి జలాలను ఏలూరు నగర ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన ప్రకటించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతినెలా 3వ శనివారం క్రమం తప్పకుండా లక్ష్యసాధన దిశగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈ శనివారం జలధార- జలహారతి అనే థీమ్తో స్థానిక 50వ డివిజన్ ఎంఆర్ సి కాలనీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద చేపట్టిన కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి అపూర్వ స్వాగతం లభించింది. ఎన్టీఆర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి ,, మొక్కలను నాటారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మార్పు అనేది ఒక్కరోజుతోనే సాధ్యం కాదని, నిరంతర ప్రక్రియ ద్వారానే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజల్లో స్పూర్తిని నింపటం, చైతన్యం కలిగించటం ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలమట్టాన్ని పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాటిపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు నగర ప్రజలకు ఈ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్న లక్ష్యంతో దాదాపు మూడు నెలలు విశేష కృషి చేయటం వల్లనే ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండు పూట్ల నీటిని సరఫరా చేయగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. నగర ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. అలాగే నగర ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలను అందించాలన్న లక్ష్యంతో 230 కోట్ల రూపాయలతో పైపులైన్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా గోదావరి జలాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని, దీనిలో భాగంగానే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారని ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాల్సిన బాధ్యత ఉందన్నారు. అనంతరం పారిశుధ్య పనుల నిర్వహణ విషయంలో అంకితభావంతో పనిచేస్తున్న ముగ్గురికి ఎమ్మెల్యే బడేటి చంటి తన సొంత నిధులతో సమకూర్చిన బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటి మేయర్ కర్రీ శ్రీనివాస్,కార్పొరేషన్ కమిషనర్ ఎ.భానుప్రతాప్, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, క్లస్టర్ ఇంచార్జ్ అమరావతి అశోక్, క్లస్టర్ కో ఇన్చార్జి ఆర్నేపల్లి తిరపతి, డివిజన్ ఇంచార్జ్ మంత్రి మహాలక్ష్మి నాయుడు,మాజీ కార్పొరేటర్ కోరాడ. బాలకృష్ణ, పలువురు కూటమి పార్టీల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


