పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది
1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పేదప్రజల సంక్షేమమే లక్ష్యంగా విరామమెరుగక నిత్యం పరిశ్రమిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇదేక్రమంలో అర్హులందరికీ ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షన్లను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారితో మమేకమై, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏలూరు 2వ డివిజన్లో డిసెంబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు స్థానిక నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని లబ్దిదారుల ఇళ్ళకు స్వయంగా వెళ్ళిన ఎమ్మెల్యే బడేటి చంటి వారికి పెన్షన్ సొమ్ములను అందించారు. ఇదేసమయంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై లబ్దిదారుల నుండి అభిప్రాయాలను సేకరించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను వారికి వివరించారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షన్దారుల ఇళ్ళకు వెళ్ళిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య స్వయంగా పెన్షన్ల పంపిణీ చేశారు.

