ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన శైలిలో నడిపిస్తున్న ఎమ్మెల్యే
1 min read
శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహణ
తక్షణమే అధికారులకు చరవాణి ద్వారా ఆదేశాలు
సంతోషం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఒకపక్క అభివృద్ధి, మరోపక్క సంక్షేమ కార్యక్రమాలను అత్యంత సమర్ధవంతంగా అమలుచేస్తున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దాంతోపాటూ ప్రజాసమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టనున్నామన్నారు. ”ప్రజాదర్బార్” కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం జనహితాభిలాషకు అద్దంపట్టే రీతిలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి సారధ్యంలో విజయపథంలో ముందుకు నడుస్తోంది. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలంటూ వచ్చే ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగించేలా కేవలం మాటలతో భరోసా కల్పించడం కాకుండా వారి సమస్యలకు తనదైన శైలిలో శాశ్వత పరిష్కారం చూపుతోన్న బడేటి చంటి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇదేక్రమంలో ఈ శుక్రవారం కూడా ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమం లక్ష్యసాధన దిశగా కొనసాగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి ఆయా సమస్యల తక్షణ పరిష్కారానికి ఫోన్ ద్వారా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరికొన్ని సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ స్పౌజ్ పెన్షన్ల మంజూరుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దాంతోపాటూ అవసరమైన వారికి ఇతర సామాజిక భద్రతా పెన్షన్లను వర్తింపచేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేసే బాధ్యతను తాము స్వీకరించినట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, టెలికాం అడ్వైజరీ బోర్డ్ మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు, టిడిపి నగరాధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, పార్టీ సీనియర్ నాయకులు బెల్లపుకొండ కిషోర్,మరియు క్లస్టర్ ఇంచార్జీలు, డివిజన్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.

