నయనానందకరంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం
1 min read

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తిపారవశ్యం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు.
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య ఆశీస్సులతో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లోకకళ్యాణార్థం నిర్వహించిన ఈ వేడుకలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య రామయ్య-సీతమ్మల కళ్యాణం కనులవిందుగా సాగింది.కళ్యాణ ఘట్టాలు:వేదోక్త పద్ధతిలో నిర్వహించిన ఈ కళ్యాణంలో యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర-బెల్లం, కన్యాదానం వంటి ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ముఖ్యంగా ముత్యాల తలంబ్రాల వేడుక, మాల మార్పిడి కార్యక్రమాలు భక్తులను పరవశింపజేశాయి. అనంతరం జరిగిన బంతాట, నృత్య కార్యక్రమాలు ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివరగా హారతి, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ చేశారు.పోటెత్తిన భక్తజనం:ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు కర్నూలు నగరం నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం అనంతరం సుమారు 2500 మందికి పైగా భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు సీతారామచంద్ర స్వామి కృపాకటాక్షాలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.


