పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా అండగా ఉంటాం.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
1 min read

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ను సందర్శించిన మంత్రి
కర్నూలు, న్యూస్ నేడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్ధిక మండలి ( APSEZ)లో మంత్రి టీజీ భరత్ పర్యటించారు. ముందుగా , అచ్యుతాపురంలోని ఏపీఐఐసీ జోనల్ కార్యాలయంను సందర్శించి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మరియు ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయ ఇంజనీరింగ్ విభాగపు సిబ్బందితో, అనకాపల్లి జోన్ యందు ప్రస్తుతం జరుగుచున్న ప్రాజెక్ట్ పనుల పురోగతిని సమీక్షించారు. నక్కపల్లి క్లస్టర్ యందు బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ మరియు ఏ. ఎమ్. ఎన్ ఎస్ ప్రాజెక్టుల పురోగతి గురించి సిబ్బంది మరియు కాంట్రాక్టర్ లతో సమీక్షించారు. అచ్యుతాపురం సెజ్ లో గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్ట్ పనుల పురోగతి గురించి సమీక్ష చేశారు. ఏం ఎస్ ఎం ఈ పార్కుల అభివృద్ధి మరియు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన భూ కేటాయింపుల వివరాలు, సదరు ప్రాజెక్ట్ ల అమలు గురించి సమీక్ష చేశారు. అనంతరం అనకాపల్లి ఇండస్ట్రియల్ జోన్ పారిశ్రామికవేత్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, వారు ప్రభుత్వం నుండి కోరుతున్న ఉపశమనములు, మరియు వారు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలు గురించి చర్చించారు. అనంతరం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా అచ్యుతాపురం ఏ.ఈ. టి.ఎల్ కేంద్రాన్ని సందర్శించి, ప్రస్తుత వ్యర్థాల నిర్వహణ సామర్థ్యం మరియు వ్యర్థాల నిర్వహణ కెపాసిటీ పెంపు గురించి ఆరా తీశారు. అనంతరం పలు సంస్థలను సందర్శించారు. అనంతరం మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటుందన్నారు. అచ్యుతాపురం సెజ్ లోని పారిశ్రామికవేత్తలు తెలియజేసిన సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ వర్క్స్ చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్తో ఏడాదిలోనే తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

