‘ హెచ్పివి’ తో మహిళల ఆరోగ్యం సురక్షితం..
1 min read
పోషకాహార లోపంతో.. బాలికల అవస్థలు
- చిన్న వయస్సులోనే అబార్షన్లు తగదు…
- 16 ఏళ్లలోపు సోషల్ మీడియా బ్యాండ్ నిర్ణయం… హర్షణీయం
- ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణురాలు డా. సాయి వాణి
కర్నూల హాస్పిటల్ , న్యూస్ నేడు : మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ తోపాటు, నివారించదగ్గిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభించడం అభినందనీయమని… దీన్ని 14 ఏళ్ల బాలికల నుంచి మహిళలందరూ వేసుకోవాలని ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణురాలు డా. సాయి వాణి అన్నారు. కర్నూలు నగరం ఏ క్యాంపులోని హార్ట్ ఫౌండేషన్ ఛాంబరులో ఆదివారం ‘ ఉమెన్ అండ్ హెల్త్ ’ కార్యక్రమం పై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన కిడ్నీ వైద్య నిపుణరాలు డా. సాయి వాణి మహిళల ఆరోగ్యంపై వివరించారు. సమాజంలో చాలా మంది మహిళలు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ , రొమ్ము, కిడ్నీ క్యాన్సర్ తదితర క్యాన్సర్ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, క్యాన్సర్ లక్షణాలు తెలుసుకునేందుకు ముందుగా స్క్కీనింగ్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య కరమైన జీవన శైలి, సమతుల్య ఆహారం, వ్యాయామం ద్వారా క్యాన్సర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
విద్యార్థులకు… ‘ హెచ్పివి..’
బచ్చు జానకి రాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఐదు స్కూళ్లలో విద్యార్థినీవిద్యార్థులకు హెచ్పివి వ్యాక్సినేషన్ ఇచ్చామని, విడుతల వారీగా వారికి ఇంజెక్షన్ ఇవ్వడంతో భవిష్యత్ లో క్యాన్సర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉండదని డా. సాయి వాణి స్పష్టం చేశారు. అలాగే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు కూడా ఇటీవల హెచ్పివి వ్యాక్షినేషన్ ను ఉచితంగా వేసినట్లు ఆమె పేర్కొన్నారు.
బాలికల్లో… ఊబకాయం..
ప్రస్తుత సమాజంలో ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడటం, పరిమితి లేకుండా ఆహారం భుజించడం వల్ల .. బాలికలు ఊబకాయంతో అవస్థలు పడుతున్నారని డా. సాయివాణి ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్ల పుడుతుందని … అబార్షన్లు చేయిస్తున్నారని, దీని వల్ల సదరు బాలిక ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. ఐరన్, విటమిన్ లోపంతో జీవితాంతం ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుందన్నారు.
‘ సోషల్’ బ్యాండ్… హర్షణీయం
16 ఏళ్లలోపే పిల్లలు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రేమించుకుంటున్నారని, ఇది వారి భవిష్యత్ ను నాశనం చేస్తుందని తెలుసుకోలేకపోతున్నారు. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం… అబార్షన్ చేయించుకోవడం… ఆత్మహత్యలకు పాల్పడటం వంటివి సోషల్ మీడియా వాడకంతో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాండ్ చేయడంపై తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు.
డా. సాయివాణిక ఘన సన్మానం
మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా వివరించిన ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణురాలు డా. సాయి వాణిని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి .. పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డా. రవీంద్ర బాబు, హార్ట్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు చంద్ర శేఖర్ కల్కూర, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.




