పౌర సేవలపై ప్రజలలో సంతృప్తి స్థాయి పెంచేలా పనిచేయాలి
1 min read

పారిశుద్ధ్యం,అన్నా క్యాంటీన్ల నిర్వహణ, తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లతో
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పురపాలక సంఘాలలో పౌర సేవపై ప్రజలలో సంతృప్తి స్థాయిని పెంచేందుకు కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. జిల్లాలో స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఇంటింటికీ చెత్త సేకరణ, పారిశుద్ధ్యం, దోమల నిర్మూలన, అన్నా క్యాంటీన్ల నిర్వహణ, పీ4, తదితర అంశాలపై బుధవారం సాయంత్రం జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ నగర, పట్టణ ప్రాంతాలలో ప్రతీరోజు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయాల్సిందేనన్నారు. పట్టణ ప్రాంతాలలో పౌర సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిపై రాష్ట్ర ప్రభుత్వం ఐవిఆర్ఎస్ సర్వే నిర్వహిస్తున్నదన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించని ప్రాంతాలలోని ప్రజలు తమ అసంతృప్తిని తెలియజేసే అవకాశం ఉన్నందున మునిసిపల్ కమిషనర్లు ప్రతీ రోజూ తమ పరిధిలోని డ్రైనేజీలలో చెత్త తొలగించాలని, ప్రతీ రోజూ పారిశుద్ధ్య పనులు చేయాలన్నారు. రోడ్లపై చెత్త నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోమల నిర్మూలనకు రెండు రోజులకు ఒకసారి ఫాగింగ్ చేయించాలన్నారు. ప్రజల అసంతృప్తి స్థాయి పెరగకుండా ఉత్తమమైన సేవలందించేలా సిబ్బందితో పనిచేయించాలన్నారు. అన్నా కాంటీన్లను నిర్దేశించిన సమయంలో తెరిచేలా చూడాలని, ఆవరణలో పారిశుద్ధ్యం, ప్లేట్ లు వేడినీళ్ళతో శుభ్రం చేయడం, ఆహార నాణ్యత ఉండేలా చూడాలని, ఎటువంటి ఫిర్యాదులకు అవకాశం లేకుండా సిబ్బంది కి అవగాహన కలిగించాలన్నారు. పీ4 కార్యక్రమంలో అర్హులైన బంగారు కుటుంబాలను గుర్తించి, వారికి చేయూత ఇచ్చే మార్గదర్సులను కూడా గుర్తించాలన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, జిల్లాలోని పురపాలక సంఘాల కమిషనర్లు పాల్గొన్నారు.

