లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు
1 min read

శ్రీశైలం, న్యూస్ నేడు: లోక కల్యాణార్థం పంచమఠాలలో ఈ రోజు (19.01.2026) ఉదయం విశేషంగా అభిషేకం, పుష్పార్చనలు జరిపించబడ్డాయి. ముందుగా ఘంటామఠంలో ఆ తరువాత వరుసగా భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలో ఈ పూజాదికాలు జరిపించడం జరిగింది. కాగా ఈ రోజు జరిగిన విశేషపూజాదికాలలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణ సంకల్పాన్నిపఠించారు. ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలనీ, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలనీ, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఘంటామఠంలోని గణపతికి పూజాదికాలు నిర్వహించబడ్డాయి. తరువాత అన్ని మఠాలలో సంప్రదాయబద్దంగా అభిషేకాది అర్చనలను నిర్వహించబడ్డాయి.కాగా శ్రీశైల సంస్కృతిలో చాలాకాలం పాటు మఠాలు ప్రధానపాత్ర పోషించాయి. ప్రస్తుత సాధారణశకం 7వ శతాబ్దం నుంచి నిర్మించబడ్డ ఈ మఠాలు, గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం లాంటి నిర్మాణాలను కలిగివుండి, చూడటానికి ఆలయాల మాదిరిగానే కనిపిస్తాయి. కొన్ని శతాబ్దాల నుండి కూడా ఈ మఠాలన్నీ క్షేత్ర ప్రశాంతతలోనూ, ఆలయ నిర్వహణలోనూ, ఆధ్యాత్మికపరంగా, భక్తులకు సదుపాయాలను కల్పించడంలోనూ ప్రధాన భూమికను వహించాయి. శ్రీశైలంలో కొన్ని మఠాలు కాలగర్భములో కలిసిపోగా, ప్రస్తుతం ఆలయానికి దగ్గరలో వాయువ్య భాగాన ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధరమఠం అనే మఠాలు పంచమఠాలనే పేర్లతో పిలువబడుతున్నాయి. కాగా శిథిలావస్థలో ఉన్న ఈ మఠాలలో ఘంటామఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠాలను దేవస్థానం పూర్తిగా పునరుద్ధరించింది. ప్రాచీన నిర్మాణశైలికి ఎలాంటి విఘాతం కలుగకుండా ఈ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయబడ్డాయి. అదేవిధంగా భీమశంకర మఠానికి తగు మరమ్మతులు కూడా చేయబడ్డాయి. ఈ మఠాలలోని దేవతామూర్తులకు నిత్యధూపదీప నివేదన కైంకర్యాలు జరిపించడం జరుగుతుంది.( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ.

