రక్తదానానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలి– వీసీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రక్తదానానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావలసిన అవసరముందని రాయలసీమ యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్ ఆచార్య వి. వెంకట బసవరావు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో యూనివర్సిటీ ఎన్ఎస్స్ విభాగంవారు వర్సిటీ సెనేట్ హాలులో నిర్వహించిన మహిళల్లో ఆరోగ్యంపట్ల అవగాహనా కార్యక్రమంతోపాటు, రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రహదారి ప్రమాదాలతోపాటు, శస్త్రచికిత్సలు, తలసేమిమా మొదలైన ఆనారోగ్య సమస్యలతో బాధపడేవారికి రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారన్నారు. రక్తదానంపట్ల ప్రభుత్వంతోపాటు, స్వచ్ఛందసంస్థలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఇంకా ప్రజల్లో రకరకాల అపోహలు ఉన్నాయన్నారు. వీటిని పోగొట్టేదిశగా ఎన్ఎస్స్ వాలంటీర్లు అవగాహనా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వర్సిటీ సిబ్బందితోపాటు విద్యార్థినీ విద్యార్థులను ఆయన అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. 18 – 60 సంవత్సరాల వయసుండి, రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ స్థాయిలు ఉన్నవాళ్లు 3 నుండి 4 నెలల వ్యవధిలో రక్తదానం చేయవచ్చన్నారు. ఈ దిశగా జాతీయ సేవాపథకం ఆధ్వర్యంలో తగిన అవగాహనా కార్యక్రమాలకు రూపకల్పన చేయాల్సిందిగా ఎన్ఎస్స్ విభాగాన్ని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా 27 మంది రక్తదానం చేసినట్లు, 87 మంది బ్లడ్ గ్రూపింగ్, హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించుకున్నారని ఎన్ఎస్స్ సమన్వయకర్త డాక్టర్ పి. నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు, సెట్కూరు సీఈఓ డాక్టర్ కె. వేణుగోపాల్ , కర్నూలు మెడికల్ కాలేజీ సర్జరీ ఆచార్యులు డాక్టర్ కె. మాధవీ శ్యామల, యూనివర్సిటీ ఎన్ఎస్స్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె. వెంకటరత్నం, డాక్టర్ బి. విజయుడు, డాక్టర్ ఎస్. నాగచంద్రుడు, బి. శివప్రసాదరెడ్డి, కర్నూలు రెడ్ క్రాస్ సొసైటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి. శ్రీనివాస రెడ్డితోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

