మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట
1 min read
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
నగరంలో రూ.29.81 కోట్లతో అభివృద్ధి పనులు
నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
అన్న క్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతిరోజు పరిశీలించాలి
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శనివారం 19వ వార్డులోని హోసన్నా మందిర్ రోడ్డులో రూ.50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రహదారిని పరిశీలించి పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులతో వాకీటాకీ ద్వారా మాట్లాడారు.ప్రజాధనంతో చేపట్టే ప్రతి పనిలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సిమెంట్, ఇసుక, గ్రావెల్, నీటి నాణ్యతను పరీక్షించి ప్రమాణాలకు అనుగుణమైన పదార్థాలనే గుత్తేదారులు ఉపయోగించేలా ఇంజినీరింగ్ విభాగ సిబ్బంది కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేందుకు క్షేత్రస్థాయిలో అమినిటీస్ కార్యదర్శుల పనితీరు కీలకమని పేర్కొంటూ నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు.క్యాంటీన్లలో అందించే ఆహారం తాజాగా, శుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. భోజన తయారీ నుంచి పంపిణీ వరకు అన్ని ప్రక్రియలను నోడల్ అధికారులు ప్రతిరోజు పరిశీలించి ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్వచ్ఛత పనులు, తాగునీరు వంటి అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అమినిటీస్ కార్యదర్శి శ్వేత రెడ్డి, శానిటేషన్ ఇంస్పెక్టర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

