వయోజన విద్యకు ఉల్లాస్తో ఊతం
1 min read
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం వయోజన విద్యకు ఉల్లాస్తో ఊతం లభిస్తోందని, సమాజంలో సంపూర్ణ అక్షరాస్యత సాధనమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ఉల్లాస్ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం–2020లో భాగంగా ‘ఉల్లాస్’ (సమాజంలో ప్రతి ఒక్కరికీ జీవితాంత విద్యాభ్యాస అవగాహన) పేరుతో నవభారత సాక్షరత కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గతంలో అమలులో ఉన్న సాక్షర భారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉల్లాస్ అక్షర–ఆంధ్ర పేరుతో రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. 15 ఏళ్లకు పైబడిన వయోజనుల్లో, ముఖ్యంగా మహిళల్లో ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి వారికి అక్షరజ్ఞానం కల్పించడం, మధ్యలో చదువు మానేసిన విద్యార్థులను తిరిగి ఓపెన్ పది, ఇంటర్ తరగతుల్లో చేర్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రత్యేక యాప్ను ప్రభుత్వం రూపొందించినట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో సిఎంఎం సుధాకర్, ఎస్ఈ రమణమూర్తి, ఎమ్ఈ మనోహర్ రెడ్డి, డిసిపి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

