ముందస్తు గుర్తింపే కీలకం..
1 min read

– నిశ్శబ్దంగా పెరుగుతున్న కిడ్నీ వాధ్యలు
– ప్రముఖ కిడ్నీ వ్యాధి వైద్య నిపుణురాలు డా. సాయి వాణి
– మార్చి 12అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు: మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో మూత్రపిండాలు (కిడ్నీలు) ముఖ్యమైనవని, రక్తంలో ఉండే వ్యర్థాలను తొలగించి… ద్రవాల సమతుల్యతను కాపాడడం, రక్తపోటును నియంత్రించడం వంటి ముఖ్యమైన పనులను కిడ్నీలు నిర్వహిస్తాయని, అటువంటి కిడ్నీలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు కిడ్నీ కేర్ క్లినిక్ అధినేత, ప్రముఖ కిడ్నీ వ్యాధి వైద్య నిపుణురాలు డా. సాయి వాణి. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రజలకు మూత్ర పిండాల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చికిత్స తదితర అంశాలను క్షుణ్ణుంగా వివరించారు. కిడ్నీ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం మార్చి రెండో గురువారం “ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం”ను నిర్వహిస్తున్నారు. 2040 నాటికి కిడ్నీ వ్యాధులు మరణాలకు కారణమయ్యే టాప్ 5 వ్యాధుల్లో ఒకటిగా మారే ప్రమాదం ఉందని ప్రముఖ నెఫ్రాలజి వైద్యులు డా. సాయి వాణి వెల్లడించారు.
కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలు:
మధుమేహం (డయాబెటిస్), అధిక రక్తపోటు, అధిక ఉప్పు వాడడం, అధిక బరువు, ధూమపానం, మద్యం, నొప్పి నివారణ మందులను అధికంగా వాడటం, కుటుంబ చరిత్ర
లక్షణాలు:
ప్రారంభ దశలో చాలా మందికి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే వ్యాధి ముదిరినప్పుడు: కాళ్లు, కళ్ల చుట్టూ వాపు, అలసట, బలహీనత, మూత్రంలో మార్పులు, ఆకలి తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నివారణే ఉత్తమ మార్గం
అవగాహనతోనే రక్షణ:
కిడ్నీ వ్యాధులు చాలా వరకు నిశ్శబ్దంగా పెరిగే వ్యాధులు. అందుకే ప్రజల్లో అవగాహన పెరగడం అత్యవసరం. ఆరోగ్యకర జీవనశైలి, సమయానికి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. “మూత్రపిండాల ఆరోగ్యం – ఆరోగ్యకర జీవితానికి ఆధారం” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
ముందు జాగ్రత్తలతో.. కంట్రోల్..
కిడ్నీ వ్యాధులను పూర్తిగా నివారించలేకపోయినా, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. రోజూ తగినంత నీరు తాగాలి, ఉప్పు తగ్గించాలి, నియమితంగా వ్యాయామం చేయాలి, బీపీ, డయాబెటిస్ను నియంత్రణలో ఉంచాలి. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచన లేకుండా మందులు తీసుకోవద్దు.
ముందస్తు పరీక్షల ప్రాముఖ్యత
కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యము. రక్తంలో క్రియాటినిన్ పరీక్ష, మూత్ర పరీక్ష, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షల ద్వారా కిడ్నీ ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహం, బీపీ ఉన్నవారు ప్రతి సంవత్సరం పరీక్షలు చేయించుకోవడం అవసరం.

