మధ్యాహ్న భోజనం నాణ్యతతో ఉండాల్సిందే.. ఎటువంటి రాజీ పడొద్దు
1 min read

నాణ్యత విషయంలో విద్యార్థులు, తల్లితండ్రుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోండి
తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తా,పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటా
జిల్లా కలెక్టర్ హెచ్చరిక
స్థానిక అశోక్ నగర్ లోని కె.పి.డి టి హైస్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
విద్యార్థులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు.
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతను ఉపాధ్యాయులు పరిశీలించిన తరవాతే విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విద్యాశాఖాధికారులను ఆదేశించారు. స్థానిక అశోక్ నగర్ లోని కె.పి. డి టి హైస్కూల్ ని శనివారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం నాణ్యత , విద్యా బోధనల స్థాయిలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి కలెక్టర్, డీఈఓ సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఏజెన్సీ వారు, ఉపాధ్యాయులు ఎటువంటి రాజీ పడవద్దన్నారు. విద్యార్థులు, వారి తల్లితండ్రుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోవాలని, మధ్యాహ్న భోజనం రుచి, శుచి తప్పనిసరిగా ఉండేలా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలన్నారు. కె.పి. డి టి హైస్కూల్ లో భోజనం నాణ్యతను విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొంతమంది విద్యార్థులు ఇంటివద్దనుండి బాక్స్ లలో భోజనాన్ని తీసుకురావడంపై కలెక్టర్ వారిని పిలిచి అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి వెంకటలక్ష్మమ్మ, ఎంఈఓ వి. అరుణ్ కుమార్, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోధ్యాయుడు నాగమునేశ్వరరావు, ఉపాధ్యాయులు, ప్రభృతులు పాల్గొన్నారు.

