మనమిత్ర వాట్సప్ గవర్నెస్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి
1 min read

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
కర్నూలు, న్యూస్ నేడు : రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చేపట్టిన మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ వాట్సప్ గవర్నెన్స్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆసేవలను వినియోగించేందుకు కృషి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఎస్సి కార్పొరేషన్ ద్వారా ఎన్ఎస్ఎఫ్డిసి,ఎన్ఎస్ఎకెఎఫ్డిసి పధకాల కింద వాహనాల కొనుగోలు,స్వయం ఉపాధికై రుణాలు తీసుకున్న లబ్దిదారులు ఏప్రిల్ లోగా అసలు చెల్లిస్తే వారికి వడ్డీ మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించారని కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్దిదారులకు సిఎస్ సూచించారు. ఎన్ఎస్ఎఫ్డిసి,ఎన్ఎస్ఎకె ఎఫ్డిసి రెండు కార్పొరేషన్ల ద్వారా సుమారు రూ. 260 కోట్ల అసలు రూ.40 కోట్ల వడ్డీ కలిపి రూ. 300 కోట్ల లు వసూలు కావాల్సి ఉందన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. జిల్లా ఎస్సి కార్పొరేషన్ అధికారులు పూర్తిగా ఇందుకు సహకరిస్తారని చెప్పారు. అంతకు ముందుకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై మాట్లాడుతూ ఆసర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ లను సిఎస్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ప్రదీప్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

