మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి…
1 min read

కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.శ్రీహర్ష డిమాండ్
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్రంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.శ్రీహర్ష డిమాండ్ చేశారు. సోమవారం శ్రీహర్షను బిర్లా కాంపౌండ్లోని ఆయన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కలిసి, వారి సమస్యలు వివరించారు. అనంతరం తమ పోరాటానికి మద్దతు కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ.. ఏపిఎండబ్లూయూ పోరాటానికి తాము మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ రూ.13 వేల వేతనంతో జీవించడం సాధ్యమయ్యే పనేనా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రయాణ, భోజన ఖర్చులు పోగా మిగిలేది ఏముందని, దాంతో కుటుంబాన్ని పోషించేది ఎలా అని నిలదీశారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడానికి కూడా నెలల సమయం తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు మానవత్వ కోణంలో ఆలోచించి, కార్మికుల శ్రమను దోపిడి చేసుకోకుండా వెంటనే వారి వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నాయకులు మనోహర్, వెంకటేశ్వర్లు, సమీర్ బాష, రంగ, తదితరులు, పాల్గొన్నారు.

