తల్లితండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకండి…
1 min read

మహానంది, న్యూస్ నేడు: తల్లితండ్రులు మైనర్లకు ద్విచక్ర మరియు ఏ ఇతర వాహనాలు ఇవ్వవద్దని మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి సూచించారు. మండలంలోని బొల్లవరం గ్రామంలో గ్రామస్తులతో ఎస్సై మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడుపుతూ ఉన్న సమయంలో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు తల్లితండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది అన్నారు. ద్విచక్ర వాహనం నడిపే వారు లైసెన్స్ తో పాటు హెల్మెట్ కచ్చితంగా అధరించాల్సి ఉంటుందన్నారు. లేదంటే జరిమానా విధించడంతో పాటు చట్టపరంగా తీసుకునే చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది దీనిని దృష్టిలో ఉంచుకొని వాహన చోదకులు నడుచుకోవాల్సి ఉంటుంది అన్నారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరిస్తామని, ఇక్కడ పరిష్కారం కాని వాటిని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో వివాదాలకు పోకుండా శాంతియుతంగా, సోదర భావంతో మెలిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని గ్రామస్తులకు తెలియజేశారు . గ్రామాల్లో అల్లర్లు సృష్టిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు.

