ఉగాది ఏర్పాట్లపై సమీక్షా సమావేశం
1 min read

దర్శనం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
అన్ని విభాగాలు సమన్వయంతో విధులునిర్వర్తించాలి
క్యూకాంప్లెక్సు, క్యూలైన్లలో నిరంతరం మంచినీరు, అల్పాహారం అందజేయాలి
భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టాలి
కార్యనిర్వహణాధికారి : శ్రీ యం. శ్రీనివాసరావు
శ్రీశైలం, న్యూస్ నేడు: మార్చి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఉగాది మహోత్సవాల సందర్భంగా భక్తులు ముందస్తుగానే క్షేత్రాన్నికి విచ్చేస్తున్నారని కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు పేర్కొన్నారు.భక్తులరద్దీని అనుసరించి దర్శనం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కార్యనిర్వహణాధికారి సూచించారు. ముఖ్యంగా భక్తులు ఎలాంటి అసౌకర్యానికి లోనుకాకుండా ప్రశాంతంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునే విధంగా దర్శనం ఏర్పాట్లు ఉండాలన్నారు. ఉగాది మహోత్సవాల ఏర్పాట్లను ఈ రోజు (09.03.2026) కార్యనిర్వహణాధికారివారు సమీక్షించారు. దేవస్థానం కార్యాలయ భవనములోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికా రివారు మాట్లాడుతూ ఉగాది మహోత్సవాలలో భక్తులందరికీ గతంలో వలనే శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించడం జరిగిందన్నారు. భక్తుల సౌకర్యార్థమైన ఉత్సవాలకు ముందస్తుగా 10 రోజులపాటు విడతల వారిగా స్పర్శదర్శనం కల్పించడం జరుగుతోందన్నారు. ఈ నెల 6 నుంచి స్పర్శదర్శనం కల్పించబడుతోందన్నారు. 15వ తేదీ వరకు రోజుకు నాలుగు విడతలుగా స్పర్శదర్శనాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా క్యూకాంప్లెక్సు విభాగం, ఆలయ విభాగం పరస్పర సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా విడతలవారిగా స్పర్శదర్శనం, అలంకారదర్శనాన్ని కల్పించాలన్నారు. క్యూకాంప్లెక్సు, క్యూలైన్లలో వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారాన్ని అందిస్తుండాలని అన్నప్రసాద వితరణ విభాగాన్ని ఆదేశించారు. క్యూకాంప్లెక్సులోని ఫ్యాన్లు, కూలర్లు సజావుగా పనిచేసేవిధంగా తగు పర్యవేక్షణ చేస్తుండాలని ఎలక్ట్రికల్ విభాగాన్ని ఆదేశించారు. సిబ్బంది అందరు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులను నిర్వర్తిస్తుండాలన్నారు. ఇప్పటికే కార్యాలయ సిబ్బందికి అదనపు విధులను కేటాయించడం జరిగిందని, తదనుగుణంగా అధికారులు, సిబ్బంది అందరు కూడా సమయపాలనతో ప్రత్యేక విధులను నిర్వర్తిస్తుండాలన్నారు. క్యూలైన్ల నిర్వహణలో పోలీసుశాఖ వారి పూర్తి సహాయ సహకారాలు పొందాలని ముఖ్యభద్రతాఅధికారిని ఆదేశించారు. ఉత్సవాలకు కాలిబాట మార్గములో అనగా వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట్ల, పెద్దచెరువు, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా క్షేత్రానికి రావడం జరుగుతున్నదన్నారు. ఇప్పటికే పాదయాత్ర భక్తులు శ్రీశైలక్షేత్రాన్ని చేరుకోవడం జరుగుతుందన్నారు. అటవీశాఖ అధికారుల సమన్వయంతో కాలిబాట ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కాలిబాటలో భక్తులకు మంచినీటిని అందించడములో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా ఎటువంటి అంతరాయం లేకుండా నీటిసరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టాలని నీటిసరఫరా విభాగాన్ని ఆదేశించారు. కాలిబాట మార్గంలోని నాగలూటి, పెచ్చెర్వు, కైలాసద్వారం మొదలైన చోట్ల మరియు శ్రీశైలక్షేత్ర పరిధిలో పలుచోట్ల భక్తులకు అన్నదానం చేసే దాతలకు దేవస్థానం నుండి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్సవాలలో క్షేత్రపరిధిలో కూడా పలుచోట్ల భక్తులు అన్నదానం చేస్తుంటారని, అన్నదాన బృందాలన్నింటికి దేవస్థానం తరుపున ఆయా ఏర్పాట్లను చేయాలని ఇంజనీరింగ్ మరియు అన్నప్రసాద వితరణ విభాగాలను ఆదేశించారు. ముఖ్యంగా అన్నదాన ప్రాంతాలలో పైప్ పెండాల్స్, లైటింగు ఏర్పాట్లు ఉండాలన్నారు. ఆలయంలో స్వచ్ఛంద సేవలను అందించే సేవకుల స్వచ్ఛందసేవలను తగు సమన్వయంతో వినియోగించుకోవాలన్నారు.

