శ్రీశైలంలో ‘ఆహార భద్రత ’ అధికారుల విస్తృత తనిఖీలు
1 min read

హోటళ్లు, గోబీ సెంటర్లలో ఆహార పదార్థాల పరిశీలన
- శివ భక్తులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచన
- కల్తీ ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
- నిషేధిత ,సింథటిక్ రంగు కలిపిన గోబీని చెత్త బుట్టలో పారవేసిన అధికారులు
శ్రీశైలం, న్యూస్ నేడు :దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీశైలంలో ఆహార భద్రత అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు వచ్చే శివమాలధారులు, భక్తులకు నాణ్యమైన ఆహారం అందించాలని కర్నూలు ఆహార భద్రత అధికారి రాజగోపాల్ దుకాణాల యజమానులకు సూచించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆహార భద్రత అధికారులకు గురువారం నుంచి విధులు కేటాయించారు. కర్నూలు , నంద్యాల, రాయచోటి , అనంతపురం నుంచి ఆహార భద్రత అధికారులకు విధులు కేటాయించడంతో… వారు బృందాలుగా ఏర్పడి హోటళ్లు, గోబీ సెంటర్లును పరిశీలించారు. శుక్రవారం శ్రీశైలంలోని వివిధ హోటళ్లు, గోబీ సెంటర్లు, వివిధ తినుబండారాలను పరిశీలించారు. శివస్వాములకు, భక్తులకు నాణ్యమైన ఆహారం అందించాలని, రంగులు కలిపిన గోబీ, కల్తీ ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఆహార భద్రత అధికారి రాజగోపాల్ ఈ సందర్భంగా దుకాణాల యజమానులను హెచ్చరించారు. అదేవిధంగా కల్తీ ఆహారం విక్రయంతో జరిగే నష్టం, ఆరోగ్య సమస్యలు తదితర అంశాలపై హోటళ్ల యజమానులకు క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో అనంతపురం ఏఎఫ్సి రామ చంద్రడు, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు ( నంద్యాల), రాయచోటి నుంచి ప్రవీణ్ ఎఫ్ఎస్ఓ, సిబ్బంది తదితరులు తనిఖీలు పాల్గొన్నారు.


