ఏసీబీ వలలో ఎస్ఎస్ఏ ఏఈ రమేష్
1 min read
40 వేలు లంచం తీసుకుంటుండగా అధికారుల మెరుపు దాడి
లంచం అడిగితే సమాచారమివ్వండి:ఏసీబీ డీఎస్పీ..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఏసీబీ అధికారుల మెరుపు దాడితో అధికారులు ఉలిక్కిపడ్డారు. సర్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) తెలుగు రమేష్ 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే మిడుతూరు, జూపాడుబంగ్లా మండల కేంద్రాల్లో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల భవనాలను కాంట్రాక్టర్ తెలుగు శ్రీరాములు నిర్మిస్తున్నారు.41 లక్షల రూపాయల బిల్లులు మంజూరు కావాలంటే ఈ భవనాలు నాణ్యతగా ఉన్నాయని సర్టిఫికెట్ ఇవ్వడానికి ఏఈ లంచం డిమాండ్ చేశాడు.శనివారం మధ్యాహ్నం బ్రాహ్మణకొట్కూరు నేషనల్ హైవే రోడ్డు సింహాద్రి కోల్డ్ స్టోరేజ్ వద్ద కారులో కాంట్రాక్టర్ శ్రీరాములు వద్ద నుండి ఏఈ రమేష్ 40 వేల రూ.లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సోమన్న మరియు సీఐ కృష్ణయ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
కారు పైనే నోట్లకు పంచనామా
అధికారులు కారు బానెట్ పైనే పంచనామా నిర్వహించి ఫినాప్తలిన్ పౌడర్ 500 రూ.ల నోట్లకు పౌడర్ కలిపిన నోట్లను స్వాధీనం చేసుకుని రసాయన పరీక్షలో నిందితుడు చేతులు కడిగిన నీరు గులాబీ రంగు మారడంతో లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.ఏఈ రమేష్ పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు కోర్ట్ లో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు.అధికారులు లంచం అడిగితే మాకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ తెలిపారు.


