ఫిర్యాధుదారుల సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టండి
1 min read

అధికారులతో చరవాణి ద్వారా పరిష్కారయాత్నం
సీజనల్ వ్యాధుల పట్ల పారిశుద్ధ్య మెరుగుకై సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలి
అధికారులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారులు ఆదేశించారు. ఏలూరు శాంతినగర్ లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజల నుంచి ఎంపీ మహేష్ కుమార్ అర్జీలు స్వీకరించారు. పలువురు వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారం కోరుతూ ఎంపీ మహేష్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు. ప్రజలు చెబుతున్న సమస్యలను ఎంపీ మహేష్ కుమార్ సావధానంగా విని, కొన్నింటికి అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించారు.గ్రామాల్లో నెలకొన్న సామాజిక సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధుల మంజూరుకు అంచనాలు రూపొందించి ప్రతిపాదనల నివేదికలు సిద్ధం చేయాలని ఎంపీ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. ప్రజలు తనకు అర్జీల రూపంలో సమర్పించిన సమస్యలను పరిష్కరించిన అనంతరం వాటి నివేదికలను తనకు సమర్పించాలని ఎంపీ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అలాగే తాను పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనే సందర్భాల్లో తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలో అర్జీలు అందజేయాలని ఎంపీ మహేష్ కుమార్ ప్రజలకు సూచించారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ వర్షాకాలం నేపద్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య మెరుగుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలకు తాగునీటి పైపులైన్లలోకి మురుగు చేరి కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున తాగునీటిని క్లోరినేషన్ చేసి ప్రజలకు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.


