NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులకు నాణ్యతలేని భోజనాన్ని అందించే ఏజెన్సీని తీసివేయాలి

1 min read

:ఎఐఎస్ఎఫ్

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్యాపిలి పట్టణంలో గల ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఎఐఎస్ఎఫ్  ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా, ఈ సర్వేలో విద్యార్థులకు నాణ్యతలేని పురుగులతో కూడిన భోజనాన్ని అందించే వారిని సస్పెండ్ చేయాలని అధికారులను వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్  ప్యాపిలి మండల కార్యదర్శి చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ ’ఎంతో ప్రతిష్టంగా పేద, మధ్య తరగతి చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు అనే ఉద్దేశ్యంతో, రాష్ట్ర ప్రభుత్వం  పౌష్టికారాన్ని  అందించాలని మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తూ ఉంటే, దాన్ని మధ్యాహ్న భోజన ఏజెన్సీ వారు నాణ్యత లేకుండా పురుగులతో కూడిన భోజనాన్ని అందిస్తున్నారనీ,  ప్రతి రోజూ కూడా ఉడికి ఉడకనీ అన్నం, నీళ్ళ పప్పు, గుడ్లు సరిగ్గా అందించడం లేదనీ, ఇలాంటి భోజనాన్ని  విద్యార్థులకు పెట్టడం వలన, విద్యార్థులు ఎవరు కూడా సరిగా తినడం లేదని, దానిమీద ఏ అధికారి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు వాపోయారు. భోజనం అనంతరం త్రాగునీరు లేక బాత్రూమ్ కు ఉపయోగించే నీటిని త్రాగే సంఘటనను చూసి వారు చింతించారు. విద్యార్థులకు పిఇటి   ఉన్నప్పటికీ వారిని ఆటలు ఆడించకుండా  క్రీడలకు దూరం చేస్తున్నారనీ వారు వాపోయారు. కావున తక్షణమే అధికారులు స్పందించి ఆ ఏజెన్సీని తొలగించి, విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులను కలుపుకొని  పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ నాయకులు మధు , కేశవులు మరియు తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

About Author