బంగారు కుటుంబాలకు మార్గదర్శుల మ్యాపింగ్ను వేగవంతం చేయాలి
1 min read

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు : రాష్ట్రంలో పేదరిక నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పి4 (ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజల భాగస్వామ్యం) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి పేర్కొన్నారు. గురువారం విజయవాడ నుండి స్వర్ణాంధ్ర, జీరో పావర్టీ – పి4 ప్రోగ్రామ్, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPIs) తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక & ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, సీపీఓ ఓబులేసు, నోడల్ అధికారులు, నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు స్వర్ణాంధ్ర – జీరో పావర్టీ పి4 కార్యక్రమంలో జిల్లాను ముందంజలో నిలిపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్పై ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తూ లక్ష్యసాధనకు కట్టుబడి ఉన్నామని ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. మహానంది మండలంలో తలసరి ఆదాయం అధికంగా ఉన్నప్పటికీ, పగిడ్యాల, గోస్పాడు, నందికొట్కూరు మండలాల్లో తలసరి ఆదాయం తక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ మండలాల్లో ఆదాయం పెంపుదలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ సిబ్బందిని ఆదేశించారు. పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ పురోగతి…ఈ మూడు అంశాలను సమన్వయంతో అమలు చేస్తూ జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

