రైతులకు అకాల వర్షాలు శాపంగా మారుతున్నాయి..
1 min read

హోళగుంద, న్యూస్ నేడు: రైతులకు అకాల వర్షాలు శాపంగా మారుతున్నాయి. అల్పపీడనాలు… వర్షాలతో రైతులు తమ పంటలను నష్టపోయిఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు పొలాలలో నీరు నిలిచి పత్తి పంట… మిరప పంట రైతులు నష్టపోగా… పెద్ద మొత్తంలో వచ్చిన ఉల్లి పంట పలుచోట్ల వర్షానికి నానిపోయి రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ప్రస్తుతం మొదలైన వర్షాలకు తోడు గాలివీస్తుండడంతో పూర్తిగా కంకి పైనున్న వరి పంట వర్షానికి నాని గాలికి నేల వాలింది. హెుళగుంద మండల పరిధిలోని పలు గ్రామాల పరిధిలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి వరి పైరు నేల వాలడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అప్పులు తెచ్చి… ఎంతో కష్టపడి… పంటను సాగు చేస్తే… పంట చేతికందే సమయంలో ఇలా పైరు నేల వాలడం తో పంట నాని నష్టాలు తప్పవని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేల వాలిన పంట కంకులు నీళ్లలో నాని గింజలకు మొలకలు వస్తాయని మరోసారి నష్టం తప్పదని బాధపడుతున్నారు. అకాల వర్షాలు రైతులను ముంచడానికి తప్ప మేలు చేయడానికి కాదని బాధపడుతున్నారు. వర్షం తగ్గి తమకు నష్టం జరగకుండా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నారు.

