NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎం.ఎస్.ఎం.ఇ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం

1 min read

కాకినాడ జిల్లా మ‌ల్లిశాల గ్రామంలో ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ ఏర్పాటును పరిశీలిస్తాం

అసెంబ్లీలో మాట్లాడిన ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్

కర్నూలు, న్యూస్​ నేడు:  రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎం.ఎస్.ఎం.ఇ పార్కులు ఏర్పాటుచేస్తామ‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. అసెంబ్లీలో స్వ‌ల్ప వ్యవ‌ధి చ‌ర్చలో ఆయ‌న మాట్లాడారు. కాకినాడ జిల్లాలోని జగ్గంపేట మండ‌లం, మ‌ల్లిశాల గ్రామంలో 525 ఎక‌రాల ప్రభుత్వ భూమిలో ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ ఏర్పాటుచేసేందుకు ప‌రిశీలిస్తామ‌న్నారు. రోడ్డు, ఎయిర్ పోర్టు, త‌గిన నీటి ల‌భ్యతపై పూర్తి స్థాయిలో అధ్యయ‌నం చేస్తామ‌ని తెలిపారు. ఇటీవ‌ల ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు దుబాయ్‌ గ‌వ‌ర్నమెంట్‌కు కొన్ని భూములు చూపించామ‌న్నారు. ఈ 525 ఎక‌రాల భూమిని కూడా వారి దృష్టికి తీసుకెళతామ‌న్నారు. లేదంటే ఏపీఐఐసీ ద్వారా ఎలా డెవ‌ల‌ప్ చేయొచ్చన్న దానిపై సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలిస్తామ‌ని మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. త‌ప్పకుండా ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక ఎం.ఎస్.ఎం.ఇ పార్క్ ఏర్పాటుచేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళిక‌తో ముందుకు వెళుతున్నార‌న్నారు. ఇప్పటికే ప‌లు పార్కులు ప్రారంభించామ‌ని, కొన్నింటికి శంకుస్థాప‌న చేసిన‌ట్లు చెప్పారు. త్వ‌ర‌లో మ‌రో 30 పార్కులు రెడీ అవుతాయ‌న్నారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామిక‌వేత్త విధానంతో త‌మ ప్రభుత్వం ముందుకు వెళుతుంద‌న్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విజ‌న్ వ‌ల‌నే గ‌తంలో హైద‌రాబాద్  అభివృద్ధి చెందింద‌న్నారు.

About Author